
హైదరాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయం లోపల ఉన్న శివాలయంలో ఒక తాబేలు తెల్లవారు జామున కనిపించింది. ప్రవేశించడానికి దారి లేదని, అయినా దేవాలయం లోపలికి ఎలా వచ్చిందో తెలియడం లేదని శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం తెలియజేశారు.ఈ తాబేలు దాదాపు పది సెంటీమీటర్ల పొడవు ఆరు సెంటీమీటర్ల వెడల్పు ఉంది.
ఈ కూర్మమూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తోందని చిలుకూర్ బాలాజీ మందిర ప్రధాన పూజారి సీఎస్ రంగరాజన్ తెలిపారు. పూర్వం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మావతారం పైనే మేరు పర్వతాన్ని ఉంచి వాసుకి అనేటటువంటి సర్పంతో ఒకవైపు దేవతలు ఒకవైపు అసురులు మదించారని ఆయన గుర్తు చేశారు. సాగర మథనంలో హాలాహలం వచ్చినప్పుడు దానిని పరమశివుడు మింగారని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా కరోనాను జయించడం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇవాళ చిలుకూరులో సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే ఆ వెంకటేశ్వర స్వామి త్వరలో లోకం నుంచి ఈ వైరస్ను తరిమేస్తారని చెప్పుకొచ్చారు. కూర్మం ప్రత్యక్షమవడం అంటే వైరస్ పోయి అమృతం లభిస్తుందని సూచిస్తున్నట్లుగా ఉన్నదన్నారు. భక్తులు చేసేటటువంటి ప్రార్థనలు, డాక్టర్ల ప్రయత్నాలు, ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు, అన్నిటికీ తొందరలో మంచి ఫలితం లభిస్తుందని రంగరాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Be the first to comment