
హైదరాబాద్: హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శుక్రవారం జరిగే ఐపిఎస్ అధికారుల దీక్షాంత్ సమారోహ్ (పాసింగ్ అవుట్ పెరేడ్) నుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. 28 మంది మహిళా ప్రొబేషనర్లతో సహా శిక్షణ పూర్తి చేసుకున్న 131 మంది ఐపిఎస్ ప్రొబేషనర్లు ఈ పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొననున్నారు. వీరిలో 121 మంది 2018 బ్యాచ్ కు చెందినవారు కాగా, పది మంది 2017 బ్యాచ్ కు చెందినవారు. మొత్తం 131 మంది ప్రొబేషనర్లలో 76 మంది ఇంజినీరింగ్, 27 మంది ఆర్ట్స్, 13 మంది సైన్స్, ముగ్గురు కామర్స్, ముగ్గురు న్యాయ విద్య నేపథ్యం కలిగినవారు. ఈ పాసింగ్ అవుట్ పెరేడ్ కు తమిళనాడు కేడర్ కు చెందిన కిరణ్ శృతి నాయకత్వం వహించనున్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనర్లలో ముగ్గురు మహిళలతో సహా 11 మంది ప్రొబేషనర్లను తెలంగాణాకు, అయిదుగురిని ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించారు. శిక్షణలో అత్యంత ప్రతిభ కనబరచిన తమిళనాడు కేడర్ కు చెందిన డి.వి. కిరణ్ శృతి ప్రధాన మంత్రి బ్యాటన్, హోం మంత్రి రివాల్వర్ అందుకోనున్నారు. దీక్షాంత్ సమారోహ్ కార్యక్రమం దూరదర్శన్ లో శుక్రవారం ఉదయం 7 గంటల 15 నిమిషాల నుండి ప్రత్యక్ష ప్రసారం అవుతుందని పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
This post is also available in : English
Be the first to comment