
నవంబర్ 3 న ఎన్నికలు
ఆక్టోబర్ 10 న నామినేషన్లు
నవంబర్ 10 న ఫలితాలు
హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికకు నగారా మోగింది.బీహార్ రాష్ట్రం ఎన్నికల షెడ్యూల్ తో పాటు వస్తుందనున్నా కూడా ఉప ఎన్నికలు జరిగే రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు సిద్దంగా లేకపోవడంతో నాలుగురోజుల ఆలస్యంగా ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నవంబర్ 3, మంగళవారం నాడు దుబ్బాకలో ఉప ఎన్నిక జరగనుంది. కరోనా మహమ్మారా నేపధ్యంలో పోలింగ్ సమయం గంట పాటు పెంచారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ జరగనుంది. ఇక నామినేషన్లు అక్టోబర్ 9 నుంచి 16 వరకు వేయాల్సి ఉంటుంది. నామినేషన్ల ఉప సంహరణ అక్టోబర్ 19 వరకు గడువు ఇచ్చారు. ఫలితాలు బీహర్ తో పాటే నవంబర్ 10 న వెలువడనున్నాయి.
ఇక దుబ్బాకలో ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటీకి సై అంటున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరుగుతోన్న ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా ఆయన భార్య సోలిపేట సుజాత కే టిక్కెట్ దక్కే అవకాశం కనబడుతోంది. అయితే మంత్రి హరీశ్ రావు చెరుకు శ్రీనివాసరెడ్డి వైపు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. బీజేపీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావుకు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ఇప్పటికే గత నెలరోజులుగా 75 గ్రామల్లో రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం కూడా పూర్తి చేసి విజయం పై ధీమా గా ఉన్నారు. దుబ్బాకలో ప్రజలు మార్పు కోరకుంటున్నారని , గజ్వేల్, సిద్దిపేట అసెంబ్లీలకు దుబ్బాక నిధులు మరలించుకున్నారని ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధి కోసం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు సమీక్ష సమావేశం చేసింది.
సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో దుబ్బాక ఉండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. దానికి తోడు బీజేపీ అభ్యర్ధి విజయం పై ధీమా ఉండటం, దుబ్బాక గడ్డ మీదనే టీఆర్ఎస్ ఓటమి ఖాయం అంటుడటంతో ఈ ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా దృష్టి ఉంది.
-ఎడ్ల. సతీశ్ కుమార్, జర్నలిస్ట్, హైదరాబాద్. (95055 55285)
Be the first to comment