
జైపూర్: రాజస్థాన్లో గెహ్లాట్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందంటూ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ చేసిన ప్రకటన నిజమయ్యేలా ఉంది. ఇవాళ గెహ్లాట్ నివాసంలో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశానికి 93 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. మొత్తం 109 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ఆయన చెబుతున్నా సంఖ్యపై అనుమానాలున్నాయి.
మరోవైపు సచిన్ వెంట 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలున్నారు. దీంతో వీరి సంఖ్య 21కి చేరింది.
200 మంది ఎమ్మెల్యేలున్న రాజస్థాన్ అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 101. గెహ్లాట్ సర్కారుకు 93 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలుపుకుంటే గట్టెక్కడం ఖాయమని గెహ్లాట్ వర్గీయులు చెబుతున్నారు. ఇటు బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరితో పైలట్ చేయి కలిపితే 72+21= 93 అవుతుంది. ఈ తరుణంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత పెరిగింది. వారు ఎవరికి మద్దతిస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు.
మరోవైపు సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ అన్ని యత్నాలూ చేస్తోంది. కేసీ వేణుగోపాల్ను, గజేంద్ర షెకావత్ను జైపూర్ పంపించారు. ఇప్పటికే జైపూర్లో సుర్జేవాలా తదితరులున్నారు.
చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా వాద్రా కూడా సచిన్ పైలట్తో మాట్లాడి నచ్చచెప్పాలని చూసినట్లు తెలిసింది. మరోవైపు పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా గమనిస్తోంది.
Be the first to comment