
వంశీ వేగేశ్న సంస్థల సేవలు ప్రశంసనీయమని “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ ప్రతినిధి రాధిక మంగిపూడి ప్రశంసించారు. ఘంటసాల ఆలయంలో ఆమె జ్యోతి ప్రకాశనం గావించి దీపావళి ఉత్సవాన్ని ప్రారంభించారు. ప్రముఖ రచయిత్రి, అంతర్జాతీయ కార్యక్రమాల వ్యాఖ్యాత రాధిక మంగిపూడి, లోరియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సప్లై చైన్ డైరెక్టర్ మంగిపూడి సాయి ప్రకాష్ దంపతులు, హైదరాబాద్ వేగేశ్న ఫౌండేషన్ & వంశీ ఆశ్రమాన్ని సందర్శించి గత మూడు దశాబ్దాలుగా నిరాటంకంగా దివ్యాంగులకు, వృద్ధులకు, పేద కళాకారులకు ఈ సంస్థ చేస్తున్న సేవలను ఎంతగానో ప్రశంసించారు. ముఖ్యంగా ఒకే ప్రదేశంలో దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు కల్పించడం, ఉచితంగా వారికి శస్త్ర చికిత్సలు చేయించడం ఎంతో ఉదాత్తమైనదని, తప్పకుండా ఈ సేవకు వారు కూడా సహకరిస్తామని, నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ పచ్చని ప్రశాంత ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం, షిరిడి సాయి దేవాలయం, ఘంటసాల స్మృతి మందిరం దర్శించుకుని కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులిద్దరినీ, వంశీ వేగేశ్న సంస్థల అధ్యక్షులు శిరోమణి వంశీ రామరాజు మరియు వంశీ మేనేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ ఆలయ మర్యాదలతో సత్కరించారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలలో ఇతర దేశాల నుండి వివిధ తెలుగు సంస్ధల ప్రతినిధులు విచ్చేసి సహకరించడం తమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని వంశీ రామరాజు ఆనందం వ్యక్తం చేశారు.
Be the first to comment