Eekshnam Exclusive: నల్లగొండ కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ ‘2014 ఫార్ములా’?

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మరోసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ను రాజకీయంగా బలహీనపర్చే లక్ష్యంతో గతంలో అనుసరించిన వ్యూహాన్ని బీఆర్‌ఎస్ మరోసారి తెరపైకి తీసుకురావాలని చూస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు తెరవెనుక సంప్రదింపులు జరుపుతున్నారనే సమాచారం ఆసక్తి రేపుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఇరు పార్టీల నుంచి ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన 2014 ఎన్నికల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఇప్పటికీ ప్రస్తావనకు వస్తూనే ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా.. సీపీఐ ఒక స్థానంలో విజయం సాధించింది. బీఆర్‌ఎస్ ఆరు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.

అయితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, సీపీఐకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరడం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ రమావత్, నల్గొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి 2016లో TRSలో చేరారు.

అదే సమయంలో నల్గొండ జడ్పీ చైర్మన్ బాలు నాయక్ కూడా కాంగ్రెస్‌ను వీడి TRSలో చేరారు. ఆయన చేరికతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్ పదవులు TRS ఆధీనంలోకి వచ్చినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.

ఈ పరిణామాల ప్రభావం తర్వాతి ఎన్నికలపై కూడా కనిపించింది. 2018లో ఉమ్మడి నల్లగొండ ప్రాంతంలో బీఆర్‌ఎస్ ఆధిపత్యం మరింత పెరిగి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ మూడు స్థానాలకు పరిమితమైంది.

ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. బీఆర్‌ఎస్ ప్రతిపక్షంలో ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం బీఆర్‌ఎస్ వర్గాల్లో ఉంది.

ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తితో ఉన్న నేతలు, స్థానికంగా గ్రూపు రాజకీయాలతో ఇబ్బంది పడుతున్న ప్రజాప్రతినిధులపై బీఆర్‌ఎస్ దృష్టి సారించిందనే ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరుపుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఆ ఎమ్మెల్యేల పేర్లు, చర్చల స్వరూపం, వారు పార్టీ మారే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని భావిస్తున్న కొందరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై ముందుగానే అంచనాలు వేసుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.

వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అంతర్గతంగా రాజకీయ లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గాల్లో పార్టీ అంతర్గత సమీకరణాలు, వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు, వచ్చే ఎన్నికల్లో టికెట్ అవకాశాలు వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి.

అయితే ప్రస్తుతానికి ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలే తప్ప.. సంబంధిత ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు.

  • Removes Up To 100% Dandruff: The Naturali Dandruff Defence Shampoo effectively works to clarify the scalp of flakes, exc…
  • Targets Dandruff-Causing Microbes: The Naturali Dandruff Defence Shampoo contains tea tree oil for hair to target dandru…
  • Reduce Excess Oil | Soothe Irritated Scalp: Naturali Dandruff Defence Shampoo works to clarify the scalp of excess oil &…

మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ సంస్థాగతంగా కూడా కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి ఉందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాల్లో నాయకత్వం, అభ్యర్థిత్వం విషయంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విషయంలోనూ పార్టీ టికెట్‌పై వివిధ ఊహాగానాలు వచ్చాయి. నల్లగొండ, భువనగిరి స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై అప్పట్లో బీఆర్‌ఎస్‌లో అంతర్గత చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.

మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు రాజకీయ వారసత్వంపై కూడా చర్చ కొనసాగుతోంది. హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి భవిష్యత్ రాజకీయ అడుగులపై ప్రచారం వంటి అంశాలు కూడా జిల్లాలోని రాజకీయ సమీకరణాల్లో భాగంగా మారాయి.

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పడే ఏ చిన్న రాజకీయ అసంతృప్తినైనా తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోందనే ప్రచారం ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చకు దారితీస్తోంది.

అదే సమయంలో కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలు, కీలక నేతల రాజకీయ కదలికలపై అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ నిజంగానే 2014 తర్వాతి వ్యూహాన్ని మరోసారి అమలు చేయబోతుందా? ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జరుగుతున్నట్లు చెబుతున్న సంప్రదింపులు ఎంతవరకు నిజం? లేక వచ్చే ఎన్నికలకు ముందు రాజకీయ ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమా? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

ప్రస్తుతం మాత్రం ‘2014 ఫార్ములా’ మళ్లీ పనిచేస్తుందా? అన్నదే ఉమ్మడి నల్లగొండ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Leave a Reply