భార్య ముక్కు కొరికిన భర్త.. అదనపు కట్నం కోసం వేధింపులు..

మంచిర్యాల, సెప్టెంబర్ 16 (క్షణం): మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఓ భర్త తన భార్య ముక్కును బలంగా కొరికిన ఘటన కోటపల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని తొలుత స్థానికంగా చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మమతకు, అదే మండలంలోని మల్లంపేటకు చెందిన ఎనగందుల మణిచందర్‌తో సుమారు తొమ్మిదేళ్ల క్రితం వివాహమై, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

గత నాలుగేళ్లుగా అదనపు కట్నం కోసం మణిచందర్‌ తనను వేధిస్తున్నాడని, మద్యం సేవించి తరచూ గొడవకు దిగేవాడని మమత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవ జరగడంతో మమత తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. సుమారు పది రోజుల తర్వాత మణిచందర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి కోటపల్లిలోని అత్తింటికి వెళ్లాడు.

ఈ సందర్భంగా మణిచందర్‌ మమత తండ్రి నారాయణపై దాడికి యత్నించగా అడ్డుకునేందుకు మమత ప్రయత్నించగా.. ఆమె ముక్కును బలంగా కొరికినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మమతకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది.

కుటుంబ సభ్యులు వెంటనే మమతను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

కేసు నమోదు.. దర్యాప్తు ఘటనపై కోటపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అదనపు కట్నం వేధింపులు, దాడికి సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply