చివరిసారి అన్నకు రాఖీ కట్టి.. కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికిన చెల్లి

షాద్‌నగర్‌, ఈ క్షణం: రాఖీ పండుగకు కొద్దిరోజుల ముందే అన్నను కోల్పోయిన చెల్లెలి విషాదం కుటుంబ సభ్యులు, బంధువులను కన్నీటిపర్యంతం చేసింది. చివరిసారిగా తన అన్నకు రాఖీ కట్టి కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికిన చెల్లెలి దృశ్యం హృదయాలను కలచివేసింది.

షాద్‌నగర్ పట్టణంలోని నెహ్రూనగర్ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. చటాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలోని మటన్‌ షాపులో విద్యుత్‌ వైరును మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర విద్యుత్‌ షాక్‌కు గురైన నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

రాఖీ పండుగ సమీపిస్తున్న సమయంలో నవీన్‌ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నంటే ఎంతో ఇష్టపడే చెల్లెలు పూజిత.. బతికుండగా రాఖీ కట్టాల్సిన తన అన్నకు చివరిసారిగా రాఖీ కట్టి కన్నీటితో వీడ్కోలు పలికింది.

అన్న మృతదేహం వద్ద పూజిత రాఖీ కడుతూ కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యాలు కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్రంగా కలచివేశాయి. ప్రాణానికి ప్రాణమైన అన్నను కోల్పోయిన బాధతో ఆమె రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

చిన్న వయసులోనే నవీన్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనుకోని ప్రమాదంలో యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో నెహ్రూనగర్‌ కాలనీలో విషాదం నెలకొంది. రాఖీ పండుగను అన్నాచెల్లెళ్లు ఆనందంగా జరుపుకోవాల్సిన సమయంలో.. నవీన్‌కు చివరిసారిగా రాఖీ కట్టి అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడం కుటుంబ సభ్యులను మరింత విషాదంలోకి నెట్టింది.

Leave a Reply