6 ఏళ్ల కుమార్తెను నడుముకు కట్టుకొని బావిలో దూకి తల్లి ఆత్మహత్య..

మంచిర్యాల, ఈ క్షణం: భర్త వేధింపులు తాళలేక, పుట్టింటికి వచ్చినా మనశ్శాంతి కరువై ఓ కన్నతల్లి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల కడసారిన కూతురిని నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత (26)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమార్తె అక్షిత (6), కుమారుడు మహేందర్ (18 నెలలు) ఉన్నారు.

పుట్టింట్లోనే నివాసం: కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు జరుగుతుండటంతో రజిత పిల్లలతో కలిసి లింగాపూర్‌లోని తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. భర్త అంజయ్య అప్పుడప్పుడు వచ్చి పిల్లలను చూసి వెళ్తుండేవాడు.

మళ్లీ మొదలైన గొడవ: ఆదివారం ఉదయం రజిత తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో అంజయ్య ఎప్పటిలాగే ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య మళ్లీ తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.

సోదరికి చివరి ఫోన్: భర్త వెళ్లిపోయిన తర్వాత, పుట్టింటికి వచ్చినా అతని వేధింపులు ఆగడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన రజిత.. 18 నెలల చిన్నారి కుమారుడిని ఇంట్లోనే పడుకోబెట్టింది. అనంతరం జన్నారం మండలంలో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది.

సోదరికి విషయం చెప్పిన కొద్దిసేపటికే రజిత తన 6 ఏళ్ల కుమార్తె అక్షితను చీరతో నడుముకు కట్టుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకేసింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే తల్లి, కుమార్తె ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తల్లి, చెల్లి మృతి చెందగా.. ఏమీ తెలియని 18 నెలల పసికందు ఒంటరిగా మిగలడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Leave a Reply